అక్రిడిటేషన్‌ రూల్స్‌లో కొంత భాగాన్ని కొట్టిసిన హైకోర్టు..

జర్నలిస్టులకు గుర్తింపు కార్డుల నిరాకరణ చెల్లదు: అక్రిడిటేషన్‌ రూల్స్‌లో కొంత భాగాన్ని కొట్టిసిన హైకోర్టు..



చిన్న పత్రికల్లో పని చేసే జిల్లా, నియోజక వర్గ స్థాయి జర్నలిస్టులకు మీడియా అక్రిడిటేషన్‌ (ప్రభుత్వ గుర్తింపు కార్డు) ఇవ్వకుండా దూరం పెట్టడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ మీడియా అక్రిడిటేషన్‌ రూల్స్‌ - 2016 లోని షెడ్యూల్‌ ‘ఈ’ ని కొట్టేస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది. చిన్న వార్తా పత్రికలను నాలుగు విభాగాలుగా విభజించడం చెల్లదని పేర్కొంది. 2016లో జీవో 239 ద్వారా అప్పటి ప్రభుత్వం పెట్టిన నిబంధనలను సవాల్‌ చేస్తూ మహబూబ్‌ నగర్‌కు చెందిన తాటికొండ కృష్ణ తదితరులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే. శ్రీనివాస రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ‘చిన్న పత్రికల్లో పని చేసే జర్నలిస్టులను ఏ,బీ,సీ,డీ కేటగిరీ లుగా ఎందుకు విభజించారో సరైన వివరణ లేదు.. తగిన వివరణ, సమర్థన లేకుండా మిగతా వారితో సమానంగా గుర్తింపు కార్డులు ఇవ్వక పోవడం చెల్లదు. రెండు నెలల్లో పారదర్శక, హేతుబద్ధమైన ప్రాతిపదికన మార్గదర్శకాలు రూపొందించాలి’ అని ఆదేశించింది..